Saturday, June 30, 2012

రుక్మిణి కల్యాణం


రుక్మిణి కల్యాణం 





ధ్యానం :
కృష్ణ ధ్యానం ప్రసన్న పారిజాతాను వేత్రతోత్రైక ప్రాణయే
జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత రుహేనమః !
సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే
నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే !!

ఓం శ్రీ కృష్ణాయ నమః

1 . శ్రుత్వా గుణాన్ భువనసుందర శ్రుణ్వతాం  తే నిర్విశ్య కర్ణ వివరైహ్ హరతోంగతాపం|
    రూపం దృశాం ద్రుశిమతాం అఖిలార్ధ లాభం త్వయ్యచ్చుతా విశతి చిత్త మపత్రపంమే ||

తాత్పర్యము:
ఓ భువన సుందరా! వినువారల శ్రవణ (చెవి) రంధ్రములలో ప్రవేశించి శరీర తాపమును హరించునట్టి నీ గుణములను వినిన దాననై, చూచువారాలకు సకల లాభములను కలిగించు నీ రూపమును గురించి వినినదాననై, ఓ అచ్చ్యుతా, సిగ్గును విడిచి, నా మనసు నీ యందు లగ్నమయినది.

2. కాత్వా ముకుంద మహతీ కులరూప శీల విద్యా వయో ద్రవిణ దామభిహి ఆత్మతుల్యం |
    ధీరాపతిం కులవతీన వృణీత కన్యాకాలే నృసింహ నరలోక మనోభిరామం ||

తాత్పర్యము
ఓ ముకుందా! కులము, రూపము, శీలము, విద్య, వయస్సు, ధనము, తేజస్సు, మొదలగు గుణములలో తనకు తగిన వాడయిన , లోక మనోహరుడయిన  పతిని, కులవతి, బుద్ధిమంతురాలగు ఏ కన్య వరించదు ?

3. తన్మేభవాన్ ఖలువృతః పతిహి అంగ! జాయామాత్మార్పితశ్చ భవతోత్ర విభో విదేహి |
    మావీరభాగ మభిమర్మతు చైద్య ఆరాత్ గోమాయు వన్మృగపతేహ్ బలిమంబుజాక్ష ||

తాత్పర్యము
ఓయీ! కావున నేను నిన్ను పతిగా వరించి, ఆత్మార్పణము చేసితిని. ఓ ప్రభూ! ఓ అంబుజాక్ష! నన్ను భార్యగా స్వీకరించుము. సింహము యొక్క ఆహారము నక్కలకు చెందనట్లు వలె, వీర శేఖరుడవయిన నీ భాగమగు నన్ను శిశుపాలుడు తీసుకొని పోకుండా చేయుము.

4. పూర్తేష్ట  దత్తనియమ వ్రతదేవవిప్ర గుర్వర్చనాదిభిరలం భగవాన్ పరేశః |
    ఆరాధితోయది గదాగ్రజ ఏత్యపాణిం గృహ్నతుమే న దమఘోష సుతాదయోన్యే ||

తాత్పర్యము
నేను పూర్వజన్మలయందు చెరువులు తవ్వించి, యాగములు చేసిన, దానములు చేసిన, తీర్ధయాత్రా నియమములను, వ్రతములను,  దేవతలను, బ్రాహ్మణులను, గురువులను పూజించినదాననయినచో,
భగవానుడయిన గదాగ్రజుడు (కృష్ణుడు) వచ్చి నన్ను స్వీకరించు గాక! శిశుపాలుడు మొదలగు ఇతరులు నన్ను కన్నెత్తి చూడకుండుగాక !

5. శ్వోభావినీ త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్తస్సమేత్య పృతనా పతిభిహ్ పరీతః !
    నిర్మధ్య చైద్య మగధేశ బలం ప్రసహ్యమాం రాక్షసేన విదినో ద్వః వీర్యశుల్కాం ||

తాత్పర్యము
ఓ అజితా! రేపు జరగబోవు వివాహమునందు నీవు రహస్యముగా సేనలతో మా విదర్భకు వచ్చి శిశుపాలుడు మొదలగువారిని సంహరించి, పరాక్రమమును శుల్కముగా చెల్లించి నన్ను రాక్షస విధానమున వివాహము చేసుకొనుము.

6. అంతఃపురాంతర చరామ నిహత్య బంధూన్ త్వాముద్వహే కధమితి ప్రవదామ్యుపాయం |
    పూర్వేద్యురస్తి మహతీ కులదేవి యాత్రా యస్యాం బహిర్నవవధూహ్ గిరిజాముపేయాత్ ||

తాత్పర్యము
మా బంధువులను సంహరించకుండా, అంతఃపురము నందు సంచరించు నిన్ను పెండ్లియాడుట ఎట్లనేదవా? ఉపాయమును చెప్పెదను వినుము. వివాహమునకు ముందు ఉదయము నగరమునకు బయటనున్న గౌరీ దేవి మందిరమునకు వెళ్లి కొత్త పెండ్లి కూతురు గౌరిని పూజించుట మా కులాచారము.( కావున నీవు నన్ను అక్కడి నుండి తీసుకుని పొమ్ము.)

7. యస్యాంఘ్రి పంకజ రజ స్స్పపనం  మహాంతో వాంఛత్యుమాపతి రివాత్మతమోప హత్యైహి |
    యద్యంబుజాక్ష నలభేయ భవత్ ప్రసాదం జహ్యామ్యసూన్ వ్రత కృశాన్ సతజన్మభిహిస్యాత్ ||

తాత్పర్యము
తమ తమోగుణమును తొలగించుకొనుటకు ఉమాపతిని పూజించినట్లు వలె మహాత్ములు నీ పాదపద్మ ధూళి యొక్క స్పర్శను కోరుచున్నారో, అట్టి నిన్ను నేను కోరుకొనుచున్నాను. ఓ అమ్బుజాక్షా! అట్లు నీ  అనుగ్రహమును పొందలేక పోయినచో, వ్రతములచే కృశించి ప్రాణములు విడిచెదను. నూరు జన్మలకయిననూ నిన్నే పతిగా పొందెదను.

*********************************************************************************

హి గౌరీ శంకరార్ధాంగీ యధార్ధం శంకరప్రియే |
తధామాం కురు కళ్యాణీ కాంతం కాంతం సుదుర్లభాం !!

కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరి |
నందగోప సుతం దేవం పతిం మే కురుతేన్నమః ||

శంభుం జగన్మోహన రూపపూర్ణామ్ మిలోక్య లజ్యా కులితాం స్మితాడ్యాం |
మదూకమాలా స్వశకీకరాభ్యాం  సంవిభ్రతి అత్రిసుతాం భజేహం !!



Sunday, June 10, 2012

భద్రా కళ్యాణం






భద్రా కళ్యాణం

మూలం- డా . కే .వి .కృష్ణ కుమారి గారి భద్ర కల్యాణం .

కోటి సూర్యులతో సమానమయిన తేజస్సు ఉన్నవాడు, లోక మనోహరుడు, సర్వ లక్షణ శోభితుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ, ఏకాంతంలో, చిన్మయానందభారితుడై ఉండగా,...
అప్సరసలను తలదన్నే మిసిమి వన్నెతో, యోగినులను తలపించే పవిత్ర భావనలను రేకెత్తించే, అపురూప సౌందర్యవతి ఆకాశమార్గాన ,కృష్ణుడిని సమీపించింది. సర్వము తెలిసిన స్వామికి తెలుసు, వచ్చింది శ్రుతిరంజని అని, తెచ్చింది, తన భద్ర నుంచి సందేశమని. ఆ ముగ్ద మోహన స్వరూపుడిని చూస్తూ తన్మయురాలయ్యిందా దివ్య కాంత. తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని, ఇలా చెప్పసాగింది. ' స్వామీ! నా పూర్వ జన్మ సుకృతం వలన ఈ సౌధం పైన మిమ్మల్ని ఏకాంతంలో చూడగలిగాను. నా పేరు శ్రుతిరంజని, ఒక దేవరుషి కుమార్తెను. భక్తి యోగాన్ని జీర్ణించుకుని, తమ దర్సనం కోసం తపించిన యోగినిని. బ్రహ్మ లోకం నా నివాసం. సరస్వతి దేవి ప్రాణ సఖిని.దుర్గా దేవి వర ప్రభావం వల్ల, కేకయ పురాధీశుడు, సాక్షాత్తు, శ్రీ లక్ష్మి దేవి అంశతో, కళలతో, విరాజిల్లే చక్కని కుమార్తెను కన్నారు. ఆ సుగుణ శీలి, అద్భుత రూప లావణ్యం కల కుమార్తెకు, భద్ర అని పేరు పెట్టుకున్నారు. ' భద్రా దేవి ప్రస్తావన రాగానే, శ్రీకృష్ణుడి కళ్ళలో విచిత్రమయిన మెరుపు కనిపించింది. ఆ నటన సూత్రధారి కుతూహలాన్ని ఆలంబనగా చేసుకుని, ఇంకా చెప్పసాగింది.
'అపురూపంగా పెంచబడిన భద్రాదేవి, దిన దిన ప్రవర్ధమానమవుతూ అసమాన సౌందర్యంతో, అపూర్వ తేజస్సుతో, ఎదగసాగింది. ఒక నాడు, లక్ష్మి దేవి ఆదరంతో నన్ను పిలిచి, 'ఓ శ్రుతిరంజని! నా అంశతో జన్మించిన భద్రను నృత్య గాన చిత్ర కళల యందు, సాహిత్యము, రాజనీతి, సౌశీల్యము, నందు ప్రావీన్యురాలిని గావింపుము. భద్రను మించిన సకల కళా విశారద , సౌందర్యాది దేవత, సృష్టి లోనే లేని విధంగా తీర్చిదిద్దు.' అని ఆనతిచ్చింది.
'స్వామీ! మీ మేనత్త కూతురయిన భద్రాదేవి అద్భుత సౌందర్య రాశి. తామర పూవులను పోలిన చేతులు, మృదు మధురమయిన పలుకులు, లేలేత చిగురాకుల ఎర్రదనంతో తేనెలూరే పెదవులు, విద్యుల్లతల్లా ప్రకాశించే చూపులు, ఆవిడ తనువు వసంత కాలంలో విరబూసిన సుగంధ భరిత పుష్పలత వంటిది. ఆవిడ యవ్వన సంపద , అపురూపము, దైవ ప్రసాదితము, ఆవిడ దైవార్పితము కొరకే సృష్టించబడింది. ఆ విశాలమయిన కళ్ళలోని జీవకళ వెలుగు, మెరుపు, మైమరపు అంతా క్రిష్ణమయం. అందుకేనేమో, ఆ అద్దాల చెక్కిళ్ళపై నీలాల వెలుగులు ప్రతిబింబిస్తూ ఉంటాయి.'
సౌందర్యోపాసకుడయిన కృష్ణుడి హృదయ వీణ, తన్మయత్వంతో మూగబోయింది. ఆయన హృదయంలో, భద్ర ముగ్దమోహణ రూపం క్షణ కాలం నిలిచింది. వెన్నెల వెలుగులో ఆ దివ్య మంగళ స్వరూపుడి తేజస్సును చూస్తూ నిశ్చేష్టురాలయ్యిందా అమరాంగన. ఆ చూపుల్లో కోటి వెన్నెలల చల్లదనం, ఆ మందస్మిత వదనంలో శతకోటి నెలవంకల అమృతత్వం. భద్ర తలపులతో సర్వం మరచి, క్షణ కాలం మైమరచిన, కృష్ణుడిని చూసి, ఉత్సాహంతో, ఇంకా ఇలా చెప్పసాగింది, శ్రుతిరంజని.
'స్వామీ, సర్వజ్ఞుడవు. అయినా, భద్రా దేవి దూతగా, ఆవిడ సందేశాన్ని మీకు వినిపించడానికి వచ్చానుగనుక, నివేదిస్తున్నాను. చిన్నతనం నుంచి మీపై మరులు గొన్న భద్ర తనువు, మనసు,శ్వాస, ధ్యాస, అంతా మీరే. తనలోని ఊపిరి మీరే. కళ్ళలో మీ రూపాన్ని ముద్రించుకుని, చకోరమై, మీ నిరీక్షణ లోనే తనను తాను
శుష్కింపజేసుకుంటోంది . తన మనసెరుగక, ఆమె తండ్రి గారు, భద్రాదేవి స్వయంవరాన్నిప్రకటించారు. సంప్రదాయ బద్ధమయిన ఆ వేడుకలు తప్పనిసరి. అయితే, ఆమె మీకు ఆత్మార్పణ చేసుకుని ఉండడం వల్ల, ఇతర రాజుల గుణగణాలు, శౌర్య ప్రతాపాలు, వినలేక, అసహ్యించుకుంటూ, తన హృదయ వేదనను ఎవరితోనూ చెప్పలేక మధన పడుతోంది. నాకు తన మనసు తెలియజేసి, తన సందేశం మీకు వినిపించమంది. మీరు స్వయంవరానికి విచ్చేసి,
భద్రను పరిగ్రహించి, మీ అర్ధాంగిగా చేసుకొమ్మని అర్దిస్తోంది. మీరు వస్తారన్న ఆశతో, మిమ్మల్ని చూడాలన్న ఆరాటంతో, మీలో ఐక్యం అయిపోవాలన్న తమకంతో, నిద్రాహారాలు త్యజించి ఎదురుచూస్తోంది. ఆమెను స్వీకరించమని నా మనవి కూడా. '
కృష్ణుడు అనురాగాన్ని వర్షించే దివ్య చక్షువులతో, ఇలా అన్నాడు,' శ్రుతి రంజని, నీ మాటలు మాకు  అమితమయిన ఆనందాన్ని, సంతృప్తినీ కలుగజేసాయి. సకాలంలో నీ రాక శుభసూచకంగా కనిపిస్తోంది. నేను తప్పక స్వయంవరానికి వచ్చి, భద్రను, నా పట్టమహీషిగా చేసుకుంటాను. ఇది నా ఆన. ' అంటూ ప్రమాణం చేసాడు. తన బాధ్యతను విజయవంతంగా ముగించుకుని, ఆకాశ మార్గాన తిరుగు ప్రయాణమయ్యింది శ్రుతిరంజని.
పరమాత్మ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. 'భద్ర వేదన అనుక్షణం నా హృదయాన్ని తాకుతోంది. తన విరహం నాలో విరహాగ్నిని రగులుస్తోంది.తన భక్తిప్రపత్తులు నా మనస్సును పులకిమ్పచేస్తున్నాయి. భద్ర తీయని పిలుపులు, నన్ను అనురాగ స్రవంతిలో ముంచి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఉపేక్ష తగదు. భద్రను భద్రంగా నా
హృదయంలో దాచుకునే శుభ సమయం ఆసన్నమయ్యింది...'


కృష్ణ ధ్యానంలో , వియోగ బాధలో, ఉన్న భద్ర, తనలో తాను ఇలా అనుకుంటోంది. ' ఎందరు భార్యలు ఉన్నా, శ్రీవారు తనని వారిలో మరోకరిగా స్వీకరించకూడదా ? ఎక్కడ ఎవరితో ఉన్నా, కనీసం రోజులో ఒక్కసారయినా, ఒక్క క్షణమయినా మనసారా, 'భద్రా' అని పలకరిస్తూ, విశాల నేత్రాల నుంచి జాలువారే అనురాగామ్రుతాన్ని తనకు అందించకూడదా?
అంతర్లీనంగా, తను స్వామిలో ఏనాడో మమేకమయ్యింది. అయితే, ఆత్మసాక్షిగా కాక అగ్నిసాక్షిగా కూడా తన అర్ధాంగినన్న సత్యాన్ని, పంచభూతాల సాక్షిగా కూడా స్వామీ స్వీకరించి చూపాలి. ఈ ప్రపంచమంతా తమ జంటను చూసి పరమానందం చెందాలి. స్వామీ! చూపులతో నా గుండెల్ని చిలికివేసారే. నా హృదయ తంత్రుల్ని మీటుతూ నవరసాల సారాన్ని నాలో నింపారే. మీ మనోహర రూపాన్ని కళ్ళ నిండుగా చూసుకోవాలనే కాంక్షల బరువుతో వాలిన కనురెప్పలు మీ మధుర భావనలతో ,మనసారా మిమ్మల్ని చూడనివ్వలేదు. మీ అద్భుతమయిన కళ్ళను చూసి నిశ్చేష్టురాలిని అయ్యాను. లోకాన్ని మరచి, మీ సూదంటురాయి లాంటి కనురెప్పల ఆలంబనతో, నిశ్చలంగా చూస్తున్నప్పుడు, ఎటువంటి మత్తును రేకెత్తిస్తున్నాయి మీ కళ్ళు? కృష్ణా! నాకు తెలిసిన భక్తి మార్గం ప్రేమే. ప్రేమతో ఒక హృదయం స్పందిస్తే, ఆ ప్రేమ కోసం మీ హృదయం తల్లడిల్లిపోతున్దంటారే . మరి నా పై ఎందుకీ అలక్ష్యం? ఇంద్రనీల మణి కాంతులని తలపించే, మీ దివ్య దర్సన భాగ్యంతో, ఎండిన చేనుకు కొద్దికొద్దిగా నీరందించినట్టుగా, నా తాపాన్ని హరించకూడదా ? చాతక పక్షికి స్వాతిబిందువులు ఆధారమయినట్టు, మీరే నా జీవనాధారము. దయా సముద్రులయిన మీరు , ఆ సముద్రం ఉవ్వెత్తున ఉరకలు వేసి, పొంగి పొరలి, నన్ను ముంచి వేసినా ఆనందమే.
క్రిష్ణానుగ్రహము వల్ల ప్రాప్తించే, అలౌకికానందము అనుభావిన్చాలనే కోరికా, అంత అదృష్టం లభిస్తుందో లేదో అన్న ఆవేదన నన్ను నిలువనీయడం లేదు. '
ఇంతలో శ్రుతిరంజని రాకను గమనించి, సంభ్రమంగా చూసింది భద్ర. ఇంతవరకు ఎదురుచూసింది ఒక ఎత్తయితే, ఆవిడ గొంతులోంచి, విషయం బయటపడబోయే క్షణం అంత కంటే వెయ్యి రేట్లు ఉత్కంటభరితంగా ఉంది. 'భద్రాదేవి, కళ్యాణమస్తు!' అంది శ్రుతిరంజని, హర్శాతిశయంతో, భద్ర నుదుటి మీద ప్రేమగా చుంబిస్తూ.( ఇక్కడెన్దుకో నాకు హనుమంతుడు, లంకకు వెళ్లి వచ్చి, 'కాంచితి సీతను' అని చెప్పే సందర్భం గుర్తుకొచ్చింది. ఇది, అవతలి వ్యక్తి ఆరాటాన్ని, తపనను గమనించి, క్లుప్తంగా చెప్పే దూత మేధా సంపత్తి కదూ.) 'నీ ప్రాణ సఖుడు కనిపించాడు. ఆ దివ్య రూపాన్ని తనివి తీరా చూసే భాగ్యం, నీ వల్ల నాకు కలిగింది. ఇంతకు మించిన గురు దక్షిణ ఈ భూమండలంలో యే గురువుకూ, ఎవరూ ఇచ్చి ఉండరు. లక్ష్మీపతి, తన మాటగా నీతో ఇలా విన్నవించమన్నాడు. ఈ భద్ర
కరపద్మాలను భద్రంగా అందుకుని, పాణిగ్రహణం కావించగల తరుణం ఎంతో దూరంలో లేదని చెప్పమన్నాడు. సంప్రదాయ బద్ధంగా, తన ప్రియ సఖి భద్రను అర్ధాంగిగా స్వీకరించే తరుణం కోసం నీకన్న ఎక్కువగా తనే ఆరాటపడుతున్న విషయాన్ని వివరించమన్నాడు. నిన్ను తనలో ఐక్యం చేసుకోగలనని, తన మాటగా చెప్పమన్నాడు.'
భద్ర తన అదృష్టాన్ని నమ్మలేక, శిలా ప్రతిమలా నిలబడిపోయింది. శ్రుతిరంజని తన పాదాలకు
నమస్కరించాబోతున్న భద్ర చేతుల్ని అందుకుని, గాడంగా హృదయానికి హత్తుకుంది.

స్వర్గ తుల్యమయిన బంగారు సౌదాలతో, ఆకాసహర్మ్యాలతో, ఉండే పాండవుల ఇంద్రప్రస్త పురానికి వస్తాడు కృష్ణ పరమాత్మ. ఎంతో కాలానికి, కనుల విందుగా ఆ మోహనాకారుడిని చూడగలుగుతున్నందుకు, తన్మయత్వంతో ఆనంద పరవసులవుతారు పాండవులు. ఆప్యాయంగా వారి కుశల ప్రశ్నలు అడుగుతూ, ఆతిధి మర్యాదలు చిద్విలాసంగా స్వీకరిస్తూ, యోగక్షేమాలు విచారిస్తాడు పరమాత్మ. శ్రీ కృష్ణునిలో మంగళకరమయిన
మార్పుని గుర్తించిన పార్ధుడు కారణాన్ని అన్వేషిస్తాడు. ఎంతయినా, నరనారాయణుల మధ్య దాపరికాలు ఉండవు కదా, స్వామి కళ్ళలో కళ్యాణ శోభను, కొంటెగా దోబూచులాడుతున్న శృంగార వీచికలను కుతూహలంతో చూస్తూ, విషయ నిర్ధారణ కోసం వేచి ఉన్నాడు పార్ధుడు. ఇంతలో, కేకయ రాజ పురోహితుడు, పాండవులకు భద్రా దేవి స్వయంవర ఆహ్వానాన్ని తీసుకు వస్తాడు. అక్కడే ఉన్న కృష్ణ పరమాత్మను చూసి, ఆశ్చర్యపోయి,
అందరికీ వినమ్రంగా నమస్కరిస్తాడు. దూతను చూసి, కృష్ణుడి కళ్ళలోని ఆనందాన్ని పసిగట్టిన పార్ధుడికి విషయం అర్ధమయ్యింది. పార్దుడిని గమనించిన కృష్ణుడి కళ్ళు, కొంటేదనాన్ని నింపుకుని, అర్ధవంతంగా నవ్వాయి.
'కళ్యాణ మూర్తీ, భద్రా కళ్యాణ స్వయంవర ఆహ్వాన లేఖ మీకు స్వయంగా అందించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేటికి ఆరోదినమున భద్రదేవి స్వయంవరం. ఈ లేఖను తమ ప్రత్యేక్ష ఆహ్వానంగా భావించి, తప్పక విచ్చేయమని, మహారాజులు విన్నవించమన్నారు. చెల్లెలు భద్రా దేవిని ఆశీర్వదించడానికి విచ్చేయమని, పాండవ శ్రేష్టులకు వారి తరపున వర్తమానం అందించమన్నారు.' అంటూ లేఖలను అందజేశాడు. పాండవుల అతిధి
మర్యాదలు స్వీకరించి, వారు వీడ్కోలు అందిస్తుండగా, కేకయ రాజ్యానికి బయలు దేరాడు జగన్నాధుడు.

ప్రేమాధీనుడయిన జగన్నాధునికి, ప్రేమ స్వరూపులయిన భక్తుల గురించిన ధ్యాసే. ప్రేమ పూజారికి, అనునిత్యం ప్రేమ గల హృదయవేదనను తీర్చాలన్న ఆరాటమే. భక్త వత్సలుడికి నిరంతరం భక్తుల గురించిన ఆలోచనలే. దేవకీ వసుదేవుల ఆశ్సీస్సులు తీసుకునేందుకు, వినమ్రుడై, వారి పాదాల చెంత కూర్చుని శిరస్సు వంచాడు శ్రీకృష్ణ
పరమాత్మ. ప్రేమగా నుదుటి మీద చుమ్బిస్తూ, ఆ అద్భుతమయిన తేజస్సుకు అవాక్కయ్యి చూస్తుండిపోయింది , దేవకి. 'నన్ను ఎప్పుడూ అలా చూస్తూనే ఉంటావు, తనివి తీరదా అమ్మా?' అడిగాడు కృష్ణుడు. నల్లనయ్య కళ్ళలోని ప్రేమవాహినికి ఆ మాత్రు హృదయం ద్రవించిపోయింది. క్షణమాగి, అర్దోక్తిగా చూసి, ఏదో చెప్పాలని చెప్పలేక
తడబడుతున్న నల్లనయ్య కళ్ళలోని అవ్యక్త భావాన్ని అర్ధం చేసుకోలేక, ప్రశ్నార్ధకంగా చూసింది దేవకీదేవి.
'ఏమిటి తండ్రీ, కొత్తగా కనిపిస్తున్నావు? ఏదో విషయాన్ని చెప్పడానికి సంకోచిస్తున్నావు. నా మనసుకు అది శుభప్రదంగా అనిపిస్తోంది.' కన్నయ్య కళ్ళలో కోటి వెన్నెలలు విరిశాయి. 'భద్రాదేవి స్వయంవరానికి వెళ్తున్నానమ్మా ,' ఇద్దరి హృదయాలు, మధురాతి మధురంగా స్పందించాయి. తన నిర్ణయాన్ని అభినందిస్తూ, జరగబోయే
తన కల్యాణానికి ముందుగానే ఆశీస్సులు అందిస్తున్న తల్లిదండ్రుల సన్నిధిలో ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు .

రుక్మిణి అంతఃపుర అభ్యంతర మందిరంలో...., శ్రీవారి సేవలో నిమగ్నమయిన రుక్మిణికి శ్రీవారి చర్యలో ఏదో మార్పు కనిపించింది. లక్ష్మీపతి మనస్సు పరధ్యానంలో ఉన్నట్లు గమనించింది. ' దేవి, నీ సన్నిధిలో నా మనసు వేరే చోట ఉందని గ్రహించావు. మరి నీకు ఆగ్రహం రాలేదా?' తెలిసీ అడుగుతున్న శ్రీవారి కొంటేతనానికి, రుక్మిణి నవ్వి,' మీ సంకల్పం లేనిదే యే భావం కలుగదు కదా. మీ నిజ స్థితిని తెలుసుకుని, దివ్యమయిన ఆత్మానుభూతులను పొందే అదృష్టవంతులకు మీతో వియోగం ఎక్కడుంటుంది?' రుక్మిణి మాటలకు అడ్డు వస్తూ,' రుక్మిణి లాగా ...'
అంటున్న స్వామి వ్యాఖ్యకు ఆ ముగ్దత్వంలో కొంటెతనం తొంగి చూసింది. ఆటనాడించే వాడిని, ఆటపట్టించాలి అన్నట్టు, 'ఇంకా ఉన్నారు కదా స్వామీ...'అంది. 'రుక్మిణి, రాధ, గోపికలు, ఇంకా...'తరచి తరచి రుక్మిణి కళ్ళలోకి చూస్తున్న శ్రీవారి కళ్ళలోకి నిర్మలంగా చూస్తూ ,' ఇంకా, ఇందాక మీ పరధ్యానానికి కారణమయిన మీ ప్రేయసీ భద్రా దేవి. ప్రేమకు మాత్రమే వశమయ్యే పరమాత్మను, తన అద్భుత ప్రేమారాధనతో వశం చేసుకోగలిగింది. భద్రా స్వయంవర విషయం విన్నాను. ఆ సుకుమారి చేయ్యన్దుకుని ,చరితార్దురాలిని చెయ్యండి.' రుక్మిణిని ప్రేమాతిశాయంతో, హృదయానికి హత్తుకున్నాడు ఆ రుక్మిణీ నాధుడు.
సత్యభామ అలకగ్రుహంలో....అణువణువూ సౌందర్యదీప్తులతో దేదీప్యమానమై ప్రకాశిస్తూ, సౌందర్యో పాసకుడయిన శ్రీకృష్ణుడిని తన అద్భుత సౌందర్యంతో మైమరపిమ్పచేస్తూ ఉంటుంది, సత్యభామ. దేనిని పంచి ఇచ్చినా, శ్రీవారి ప్రేమను మటుకూ ఇతరులకు పంచి ఇవ్వలేని నిగూఢ ప్రేమతో, తన హృదయంలో మందిరం కట్టుకుని అందులోనే తన స్వామిని ప్రతిష్టించుకుని, ఆ ధ్యానంలోనే అమితమయిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అభిమానవతి అయిన సత్యాదేవి. చక్కని చుబుకాన్ని అందుకుని, కళ్ళలోకి తనివితీరా చూడబోయి, తొట్రు పడ్డాడు వాసుదేవుడు. ' ఏమిటిది సత్యా? కలువ కళ్ళలో ఆ నీరెందుకు?' ఏమి తెలియనట్టు అడుగుతున్న శ్రీవారి కళ్ళలోకి చూసి, ఏదో
చెప్పబోతున్న సత్యాదేవిని అడ్డుకుంటూ, 'సత్యా! నువ్వు చెప్పలనుకున్తున్నది నాకు అర్ధం కాదని అనుకుంటున్నావా. నీ మనసు చదివి, నీ ఆనతి ప్రకారం నడచి, సత్యాపతిగా నిలిచిపోవాలనే నీ కోరిక తీర్చడం కోసం నేను ఎంత ముచ్చట పడుతుంటానో, కదా. ఎందరున్నా, కొత్తగా ఎందరొచ్చినా, నీ స్థానాన్ని మటుకు ఎవరూ ఆక్రమించలేరు. నీ అద్భుత సౌందర్యాన్ని ఎవరూ అధిగమించలేరు. నా హృదయాన్ని నీలా ఎవరూ
రంజిమ్పచేయ్యలేరు. ఇది సత్యం.' శ్రీకృష్ణుడి మృదుమధుర భాషణలకు, ఆ కళ్ళలోని ప్రేమ వాహినికి మైమరచిన సత్య దేవి, అతని కౌగిలిలో కరిగిపోయింది.
జాంబవతీ దేవిని నీ అనురాగానికి బద్ధుడనని, సూర్యపుత్రి కాళిందిని, నిన్నువిడచి క్షణమయినా ఉండలేనని, నమ్మబలికాడు నల్లనయ్య. మేనత్త కూతురయిన మిత్రవిందను బంధుత్వం ఆపాదించిన సాన్నిహిత్యంతో, మరపిమ్పజేస్తూ, నాగ్నజితిని ఆమె సౌందర్యాన్ని ప్రశంసిస్తూ, అలరించాడు నటనసూత్రధారి. తన హృదయ నివాసిని అయిన భద్ర సన్నిధి కోసం ఆత్రపడుతూ, భద్రా స్వయంవరానికి పయనమయ్యాడు పరమాత్మ.

జగన్నాధుడి రధం శర వేగంతో ముందుకు దూసుకు పోతోంది, స్వామి మనస్సు కన్నావేగంగా. భద్రాదేవి పరమయిన విరహాగ్ని తన నులివేచ్చదనంతో, శ్రీకృష్ణుడి హృదయంలో ప్రేమ సుమాన్ని వికసింపజేస్తోంది. సర్వాంతర్యామి అయిన తన ఉనికినే, భద్ర ప్రేమ ప్రశ్నార్ధకం చేస్తోంది. నిర్మల ప్రేమకు భక్తి, నిజాయితీ గల దర్పణం. ఇంతటి ప్రేమపూర్వకమయిన భక్తిని భగవంతుడు తట్టుకోలేడు. ఆ భక్తిలో కరిగి మమేకం అవ్వకుండా భగవంతుడు ఒక్క క్షణం కూడా నిలువలేడు. భద్రను సేద తీర్చడం, భద్రను సమాధాన పరచడం, తన కర్తవ్యంగా భావించిన కృష్ణుడు, తన సంకల్పాన్నే చెల్లెలు సుభాద్రగా రూప కల్పన చేసాడు. తన మనస్సు కన్నా వేగంగా , తన ప్రతిరూపాన్ని సుభద్ర రూపంలో భద్ర దగ్గరకు తక్షణమే ప్రత్యేక్షమయ్యేలా చేసాడు. స్వయంవర సమయం దగ్గర పడుతుంటే, భద్రలో అనుకోని అలజడి మొదలయ్యింది. అనేక అనుమానాలు చుట్టుముట్టి, అశాంతిని పెంచివేస్తున్నాయి. శరీరమంతా నిండి కాంతివంతమై ఉన్న కృష్ణ తేజం తనకు తట్టుకోలేని స్పందనను కలుగజేస్తోంది.'ఎందుకు నాకీ పరీక్ష స్వామి? తల్లడిల్లుతున్న నా మనసు తెలుసుకుని, నా వేదన తీర్చే
ఆత్మబంధువులు ఒకరయినా ఇటు రాకూడదా?' అనుకుంటూ, ఒక ఉద్వేగస్థితిలో ఉండిపోయింది.
ఇంతలో తన కమల నయనాలను అనునయంతో తెరిపిస్తున్న అమృత స్పర్శ తలపయిన చల్లగా తాకింది. 'భద్రా! నేనెవరినో చూడు.' సంభ్రమంగా కళ్ళు తెరిచింది భద్ర. కళ్ళ ముందు కనిపిస్తున్నదొక ముగ్దమోహన రూపం. ఆ పరిసరాలన్నీ సుగంధ సౌరభాలతో గుబాలించడం మొదలుపెట్టాయి. ఎదురుగా, తన కళ్ళ లోకి లాలనగా చూస్తూ, సుభద్ర. సుభద్రలో ఏనాడు ఎరగని దివ్య తేజస్సు. 'ఏమిటిది? ఇలా అయిపోయావేమిటి? అందుకే నీకు ధైర్యం చెప్పి రమ్మని పంపించాడు మా అన్నయ్య. ఇలా క్షీనిన్చిపోతే నిన్నెలా ఎంచుకుంటాడు? ఇలా ఏలుకుంటాడు?' చుబుకాన్ని అందుకుని, తదేకంగా చూస్తున్న సుభద్ర స్పర్శ భద్రలో కోటి వీణలు మీటినట్టయ్యింది. సుభద్ర స్పర్సలో, లాలనలో, తనలో కలుగుతున్న స్పందనలో, ఆ జగన్నాధుని తాలూకు అంతర్గత మధురానుభూతి, మధురమయిన సౌఖ్యమే చిత్రాతిచిత్రంగా హృదయ తంత్రుల్ని మీటుతొంది.
'వదినా! ఈ సమయంలో నీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నా మనసులోని భావాలు నీతో పంచుకోవాలని ఉంది. చిన్నతనం నుంచే దేవకి దేవి నుంచి పతివ్రతల కధలు, కృష్ణ లీలలు, యశోదానందుల నుంచి బావా బాల్యక్రీడలు, రాధ ద్వారా రాసక్రీడలు, కుంతీ దేవి ద్వారా ఆర్తత్రాణ పరాయణత్వాన్ని, అక్రూర, నారదాదుల ద్వారా
కృష్ణతత్వాన్ని, చెప్పించుకుని, ఆనందపరవసురాలిని అయ్యేదాన్ని. బావను తలచుకున్న క్షణాన నా శరీరం అణువణువూ ప్రేమతో నిండిపోతుంది. నా మాటలు తడబడతాయి. నా హృదయం కరిగి కన్నీరవుతుంది. నాకీ పరిసరాలు పట్టవు. ఆయన అందాన్ని గానం చేస్తాను.
ఆనందంగా నాట్యం చేస్తాను. స్వామి చిత్రాన్ని నా హృదయపు లోతుల్లోనే ఆవిష్కరిస్తాను. దేనికీ లొంగని నా స్వామీ ప్రేమకు లొంగిపోతాడు. నా అనంత ప్రేమతో స్వామిని పొందగాలనన్న నమ్మకం నాకుంది.' సుభాద్రగా వచ్చిన కృష్ణుడికి ముగ్ద భద్ర హృదయావిష్కరణ ఆనందాన్ని కలిగిస్తోంది.
ఆ సుకుమారి ప్రేమైక హృదయం తన్మయత్వాన్ని కలిగిస్తోంది. సుభద్ర మొహం చూస్తూ అవాక్కయ్యింది భద్ర. తన ముందున్నది ఆ మదనగోపాలుని దివ్యమూర్తి. ముత్యాల వంటి స్వేదబిందువులు కస్తూరి తిలకం పై వింత వెలుగుల్ని వెదజల్లుతున్నాయి. సర్వం సుగంధ భరితం. తన కోసం ఎన్నో రేట్లు దిగి వచ్చిన చంద్రబింబపు కాంతితో, సంపెంగ వంటి నాసికతో, తన చెక్కిళ్ళను మృదువుగా స్ప్రుశిస్తున్నాడు. సిగ్గులమొగ్గయ్యి,
తీవ్రంగా కంపిస్తున్న తనూలతతో, సుభద్ర రూపాన్ని అల్లుకుపోయింది భద్ర. 'భద్రా! ఏమిటిది? నేను నీ బావను కాదు, నీ వదినను. అన్నిటా కృష్ణుడిని చూడగల భక్తిప్రపత్తులు ఉన్నదానివి. అన్నయ్యను నాలో చూడగలగడంలో ఆశ్చర్యం లేదు. మా అన్నపాండవులతో పాటుగా, నీ స్వయంవర శుభలేఖను అందుకున్నాడు. అంతకన్నా ముందే, నీ విరహాగ్ని జ్వాలతో మరింత నీలి వర్ణుడయ్యాడు. అంతకన్నా ముందుగానే, నీ భక్తిపారవశ్యం ముందు వోడిపోయాడు. అంతకన్నా ముందుగానే, నీ ప్రేమవాహినిలో మునిగిపోయాడు. అంతకన్నా మరింత ముందుగా...'
సుభద్ర కొంటె చూపుల్లో చిక్కుకున్న భద్ర కళ్ళు భారంగా వాలిపోయాయి. సిగ్గు అనే అత్యంత విలువయిన ఆభరణంతో ప్రకాశించే స్త్రీలో అతి పవిత్రమయిన తేజస్సు అంతర్లీనమై ఉంటుంది. తనకు ఎంతో ప్రీతిపాత్రమయిన ఆ ముగ్దత్వాన్ని, సిగ్గును, భద్రలో మురిపెంగా చూసుకుంటున్నాడు, కృష్ణుడు. తనను తాను అదుపులో పెట్టుకోవడం
నిగ్రహానిగ్ర సమర్దుడికే, ఎంత కష్టమో తెలిసి వచ్చింది.
అయినా, రేఖా మాత్రంగా అయినా భద్రలో మిగిలి ఉన్న గర్వాన్ని పరీక్షింపదలచి, 'భద్రా! మా అన్న నీ విషయంలో నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి పాషానుడి కోసం తపించడం కన్నా, నిన్నందుకోవాలని కలలు కనే చక్రవర్తులూ, రాజాదిరాజులూ ఎవరినయినా...' తన స్వామిని గురించి దూషణ సహించలేక పోయింది భద్ర. 'సుభద్రా!
నువ్వనాల్సిన మాటలేనా ఇవి?సామాన్య మానవుల్ని కోరుకునే వారు, దైవ ప్రేమను అనుభవించే అర్హత లేనివారు. నాకు తనే గమ్యం, మార్గం, ప్రయత్నం, సాఫల్యం. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ పోటి పది నన్ను పరీక్షిస్తున్నారు. అసలు నువ్వు సుభాద్రవేనా, లేక ఆ రూపంలో వచ్చిన...'బాధతో వెక్కిళ్ళు పెడుతున్న భద్రను ప్రేమాతిశయంతో గాధంగా దగ్గరకు తీసుకుని, ' భద్రా! నిన్ను బాధించినందుకు క్షమించు. నీ మనోభావాలు విని ఆనందించాలన్నదే ఆయన సంకల్పం. అందుకే నాతొ అలా అనిపించి ఉంటాడు' అంది సుభద్ర. 'భద్రా! నువ్వు తనను ఎంతగా ప్రేమిస్తున్నావో,
ఆరాదిస్తున్నావో, అంతకు మించిన ప్రేమను అందుకోబోతున్నవని, తన మాటగా చెప్పమన్నాడు. అణువణువునా తనని వెతికి తపించే అవసరం ఇంక లేదని, ఆణువణువూ తనే ఆక్రమించి ఊహాతీతమయిన ఆనందాన్ని, అనుభూతులను నీ పరం చేస్తానని చెప్పమన్నాడు.
ఇదిగో, నీ బావ నీకు ఈ కానుక పంపి, స్వయంగా నన్ను అలంకరించమన్నాడు. ఈ తోమ్మిదిరేకులున్న హారం, నవ బంధానికి సంకేతం. చెలికాడుగా, హితుడిగా, స్నేహితుడిగా, భర్తగా, రక్షకుడిగా, సంరక్షకుడిగా, గురువుగా, సర్వం తానుగా, నీ హృదయంలో తన స్థానాన్ని భద్రపరిచే అమూల్య కానుక ఇది', అంటూ మెడలో వేసింది.
మెడనిండా కౌస్తుభ స్పర్సలా అనిపిస్తున్న హారం, స్వామీ స్వయంగా అలంకరించి, హృదయానికి హత్తుకున్నట్టు ఉంటే, తన్మయత్వంలో, సుభద్ర వడిలోకి వదిగిపోయింది భద్ర. తల్లి నిద్రలేపడంతో, 'సుభద్ర ఏది?' అని అడుగుతున్న భద్ర మాటలు అక్కడ ఎవరికి అర్ధం కాలేదు. 'ఇదంతా కలా?' అనుకుంటూ అప్రయత్నంగా మెడ తడుముకుంది.
సుభాద్రగా తన బావ రావడం నిజం. పులకితురాలయిన భద్ర వదనంలో వేవేల చంద్రకాంతులు.
సోగకళ్ళు బరువై వాలుతుంటే, బుగ్గల్లో గులాబీలు పూస్తుంటే, ఆ హారాన్నిఅపురూపంగా హృదయానికి హత్తుకుని, మురిపెంగా దాచుకుంది.

శ్రీకృష్ణ భగవానుడి ఆగమనంతో కేకయ దేశం నూతన శోభను సంతరించుకుంది. సమస్త ప్రకృతీ పరవశించింది. ఉద్యానవనంలో దేవకన్యలా అత్యద్భుతంగా కనిపించిన భద్ర కళ్యాణ రూపం సకల హృదయ మనోహరుని సైతం మొహాతిశయంతో ముంచివేస్తోంది. పూతీవేలను చీల్చుకుని, మబ్బుచాటునుండి- పున్నమి చంద్రుడి ప్రకాశంతో వచ్చినట్టు, అరుదెంచిన భగవానుడిని చూసి, భద్రా దేవి చెలులు నిశ్చేష్టులై నిలబడిపోయారు. కన్నులారా, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలని మనసు తొందర చేస్తున్నా, మితిమీరిన సిగ్గు భద్రను నిస్సహాయురాలిని చేస్తోంది. నుదిటిపైన చిరుచెమటలు, పెళ్లకళ వచ్చిన ప్రకృతీ కాంతకు సహజ ఆభరణాలుగా అనిపిస్తున్నాయి. భద్రాదేవి చెలులు కృష్ణుడిని ఇలా వేడుకున్నారు,' స్వామి, మాంగల్య బంధంతో మా చెలిని బంధించి, అనురాగ బంధంతో ఆమె హృదయాన్ని మధించి, మిమ్మల్ని తప్ప మరేది కోరుకొని మా చెలిని స్వీకరించి, మమ్మల్ని చరితార్ధులను చెయ్యవలసిందిగా ప్రార్దిస్తున్నాం.' తన మనోభావాలను చక్కగా చెబుతున్న చెలులను చూసి ముచ్చటపడింది భద్ర. 'భద్రా! స్వయంవరంలో నీవు కోరినట్టే నిన్ను చేపడతాను. ఈ సమయంలో నీతో ఏకాంతంగా ఉండడం సంప్రదాయాన్ని మన్నించడం కాదేమో, కళ్యాణమస్తు!' అంటూ వెనుదిరిగాడు కృష్ణుడు.
కృష్ణుడి దర్శనంతో, కోటి సూర్య ప్రభలు వదనంలో వేలుగుతుండగా, కొత్త అందాలను సంతరించుకుంది భద్ర. రుక్మిణి కల్యాణం లాగే, భద్రా కల్యాణం కూడా, లోక ప్రసిద్ధం కావాలని, కేవలం బంధుత్వం వల్ల జరిగిన వివాహంగా మిగిలిపోకూడదని, కృష్ణుడిని కోరుతుంది భద్ర. భగవానుని, ఆనందభాష్పాలతో, ఎదురేగి, ఆహ్వానించిన
దృష్టకేతు మహారాజు, అతిధి మర్యాదలతో సంతుష్టి పరచడానికి తలమునకలవుతున్నాడు.
స్వయంవర ముహూర్తం సమీపించింది. అత్త్యుత్సాహంతో, తమ అర్హతలను మరచి మితిమీరిన కాంక్షతో వచ్చిన విందుడు, అనువిందుడు అనే ఇద్దరు రాజులు, గౌరీ పూజకు వెళ్ళిన భద్రా దేవిని అపహరించుకుపోయారు. శత్రువుల పాలిటి కాల యముడిలా, విన్దానువిన్డులతో తలపడి, వాళ్ళను వోడించి, బెదిరిన భద్ర చేయ్యన్దుకుని,
రధంపైన తన సరసన చేర్చుకున్నాడు, లక్ష్మీపతి. శ్రీకృష్ణుడి హ్రుదిపైన తల వాల్చి, లక్ష్మిదేవిలా భాసించింది భద్ర. వీరోచితంగా గెలుచుకొచ్చిన మరుక్షణమే, భద్ర కృష్ణుడి సోట్టయ్యింది. ఇక కృష్ణుడి అనుమతి కోసం, కళ్యాణ శుభలేఖను ఆస్థాన పురోహితుడి ద్వారా పంపి, ఆమోదాన్ని తీసుకున్నాడు మహారాజు.
భద్రా - కృష్ణుల కళ్యాణ వేడుకలకు పాండవులు, బంధువులు,దేవతలు తరలి వచ్చారు. కేకయ నగరమంతా కళ్యాణ శోభ సంతరించుకుంది. భగవానుడు సర్వాలంకార భూషితుడై, రవ్వల ఆభరణాలు నీలమేఘ కాంతితో కలిసి ప్రకాసిస్తుండగా, కన్నులపండుగగా బయలుదేరాడు. సమస్త వజ్రవైడూర్య మణిమయ భూషిత అయిన అన్నుల మిన్న భద్రను వివాహ వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. తన ముద్దుల పట్టి భద్రను, గంగాజలంతో, కాళ్ళు కడిగి, కన్యాదానం చేసాడు మహారాజు. పసిడి తెర తొలగించగా, కృష్ణుడి చిలిపి చూపులు ఎదురుకోలేక సిగ్గులమొగ్గయ్యి, తల వాల్చేసింది భద్ర. నవరత్నాలు కలిపినా తలంబ్రాలు, మాంగల్య ధారణా, సప్త పది, పేలాల నివేదనా, అరుంధతి నక్షత్ర దర్సనం వంటి సంప్రదాయ వేడుకలన్నీ, అత్యంత వైభవోపేతంగా జరుపబడ్డాయి.ఆహుతులంతా, వెలకట్టలేని, అమూల్య సంపదలను కానుకగా సమర్పించుకున్నారు. ప్రధమ సమాగమ సుముహూర్తాన, తెల్లని
వస్త్రాలు ధరించి, సర్వాలంకార శోభిత అయిన భద్రా దేవిని, కృష్ణుడి సన్నిధిలో విడిచారు సఖులు. ' మీ అర్ధాంగిగా, మీ అడుగుజాడల్లో నడవాలని, సతీధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ, వన్నె తెచ్చే విధంగా ఉండాలని, నన్ను ఆశీర్వదించండి. మీ పై ప్రేమానురాగాలు స్థిరంగా ఉండే విధంగా దీవించండి,' అంటూ ప్రణమిల్లింది భద్ర.
భద్రా- కృష్ణుల సమాగామానికి ప్రకృతి పులకించింది. పరమ పురుషునిలో ప్రకృతి కాంత లీనమైంది.

Friday, June 8, 2012

జయదేవుడు - అష్టపదులు



జయదేవుడు - అష్టపదులు

కొంతమంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 13 వ శతాబ్దానికి చెందిన, వ్యాసుని అవతారంగా భావించే ' జయదేవుడు' ఇటువంటి వారిలో ఒకరు. ఈయన జీవితం, పూర్ణ భావంతో, భక్తి విశ్వాసాలతో, సాధన చేస్తే, భగవంతుడే, అనేక రూపాల్లో వచ్చి మనల్ని రక్షిస్తాడని,తెలియజేస్తుంది. బాల్యంలోనే , ఆశుకవిత్వం చెప్పిన ఏకసంధాగ్రహి, జగన్నాధుని భక్తుడు, జయదేవుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు కనిపించడంవల్ల, ఆ పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి.

జగన్నాధుని భక్తుడయిన కళింగ రాజు, తన పాటలు కాక, జయదేవుడి పాటలు ఎక్కువ ప్రాచుర్యం పొందడం సహించలేక, పండితుల సలహాతో, ఇరువురి కీర్తనలను ఒక రాత్రి, జగన్నాధుని గుడిలో ఉంచుతాడు. ఉదయానికి, రాజుగారి గ్రంధం ముక్కలుముక్కలయ్యి ఉండడం చూసి, రాజు అభిమానపడి, ప్రాణత్యాగం చెయ్యబోతాడు. అప్పుడు జగన్నాధుని విగ్రహంలో నుంచి, 'రాజా! మీ ఇద్దరి కవితలూ గొప్పవే, ఈర్ష తో, అధికార బలంతో, నువ్వు ప్రవర్తించడం వల్ల, నీ కీర్తనలు నేను స్వీకరించలేదు, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కనుక, నీ పాటలను కూడా కొన్నిటిని స్వీకరిస్తున్నాను,' అన్న మాటలు వినిపించాయి.

జయదేవుని భార్య పద్మావతి, అతని కవితా స్పూర్తి. ఆయన రాసిన గీతాలను, తన అసమాన నాట్య పటిమతో, చక్కగా అభినయించి చూపేది. ఆ మహా భక్తుని, భార్యగా ఉండడం గొప్ప అదృష్టంగా భావించిన మహాపతివ్రత ఆమె. ఒక సారి, జయదేవుడు ప్రక్క ఊరిలో, భాగవత సప్తాహం చేసాడు. జయదేవుడు ప్రతిఫలం ఆశించడని తెలిసిన షావుకారు, నలుగురు సేవకులను రహస్యంగా ఆయన వెంట వెళ్లి, తనిచ్చిన మణిమాణిక్యాలు, బంగారం, , పద్మావతికి ఇచ్చిరమ్మని పంపాడు. ఆ నలుగురు సేవకులూ,స్వార్ధంతో కుమ్మక్కయ్యి, జయదేవుడి, కాళ్ళు-చేతులు నరికేసి, ఒక పాడుబడిన బావిలో పడేసారు. ఆ దారిలో వెళుతున్న వింధ్య రాజు, బావిలోంచి, 'కృష్ణా! కృష్ణా!' అన్న మాటలు విని, ఆయనను బయటకు తీయించేసరికి, లీలగా, ఆయన కాళ్ళు- చేతులు తిరిగి వచ్చేసాయి. ఆ రాజు జరిగింది తెలుసుకుని, సంతోషించి, తన రాజ్యంలో కూడా భాగవత సప్తాహం జరపాలని,ఆయనను పద్మావతీ సమేతంగా తీసుకువెళ్ళాడు. ఆ సప్తాహానికి, లోగడ ఆయనను బావిలో పడేసిన నలుగురు దొంగలూ వచ్చారు. భక్తి పారవశ్యంలో ఉన్న జయదేవుడు, వాళ్ళను చూడగానే, హఠాత్తుగా వెళ్లి, కౌగిలించుకున్నాడు. వాళ్ళను సత్కరించి పంపాల్సిందిగా, రాజుకు చెప్పాడు. అయితే, వెళ్ళే దారిలో, వాళ్ళు మట్టిలో సగానికి కూరుకుపోయారు. జయదేవుడికి, వారి దీనావస్థకు, దయ కలిగి, 'హే కృష్ణా! వీళ్ళను రక్షించు తండ్రి!' అని ప్రార్ధించాడు. భక్తుని మాట మన్నించి, వారిని రక్షించాడు దేవుడు.

పద్మావతికి, వింధ్య రాణికి మంచి స్నేహం కుదిరింది. ఒక రొజు, రాణి గారు పంతం కొద్దీ, పద్మావతిని పరీక్షించాలని, భటుడితో, 'జయదేవుడు, వేటలో పులి బారిన పడి చనిపోయాడని', అబద్ధం చెప్పిస్తుంది. ఆ వార్త వినగానే, ప్రాణాలు విడుస్తుంది పద్మావతి. సిగ్గుతో ప్రాయశ్చితం చేసుకోబోయిన రాజదంపతులను, జయదేవుడు వారించి, ఒక అష్టపదిని గానం చేస్తాడు. శ్రీ కృష్ణ పరమాత్మ కరిగిపోయి, పద్మావతిని తిరిగి బ్రతికించాడు. ఈ ఉదంతం, అష్టపదులకు ఉన్న మహత్తును, సంజీవిని శక్తిని తెలియజేస్తుంది.

అసలు జయదేవుడుఅనగానే, ఎవరికైనా అష్టపదులు గుర్తుకు వస్తాయి. ఈ అష్టపదులు 'గీతగోవింద మహాకావ్యం' లోనివి. ఇందులో మొత్తం 24 అష్టపదులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి, ప్రత్యేకమయిన రాగంతో, తాళంతో రచింపబడ్డాయి. ఈ గీతి కావ్యంలో ఉన్నది మూడే పాత్రలు రాధ, కృష్ణుడు మరియు సఖి. విరహవేదన ఈ కావ్యంలోని విషయం.

ఇందులో లౌకికంగా శృంగారం కనిపించినా, ఆధ్యాత్మికతే ప్రధాన విషయం. భక్తి, శృంగారం ఇందులో ఎంతో మధురంగా కలసిపోయాయి. ఇందులోని సఖి నాయికా-నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేసి వారిని సన్నిహితపరచడానికి ప్రయత్నిస్తూ ప్రేయసీ ప్రియుల ఆనంద సమాగమానికి తోడ్పడుతుంది. అష్టపదులలోని అర్ధాలను మనం చక్కగా విశ్లేషణ చేసి, ఆ మహాత్ముడి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.

తనను తాను ప్రేమించని మనిషి ఉండడు కదా! అలా, మీరెంతో, ప్రేమించే మీ ప్రాణాన్నిరెండు భాగాలు చేసి, ఇద్దరు వ్యక్తుల్లో పెట్టారనుకోండి , అప్పుడా రెండు ప్రాణాలు కలవడానికి ఎంతగా తపిస్తాయి? ఉదాహరణకు, ఒకరినొకరు అమితంగా ప్రేమించే భార్యా- భర్తలు, ప్రేయసీ- ప్రియులు ఉన్నారనుకోండి, వారి అనుబంధం ఎలా ఉంటుంది? ఒకరి కన్నీరు ఉప్పెనై మరొకరిని కలచివేస్తుంది. ఒకరి సంతోషం పూలజల్లై మరొకరిని పులకింపచేస్తుంది. వారు లేని మన జీవితం వ్యర్ధం అనిపిస్తుంది. కలయిక వసంతం, ఎడబాటు - పొరబాటు గ్రీష్మం, విరహం -బాధ శిశిరం, అనురాగం వర్షం, మమత శరదృతువులవుతాయి. అన్ని ఋతువులూ మేళవించిన భావాలు వీటిల్లో కనిపిస్తాయి. ఇదీ లౌకికంగా, సరళ భాషలో చెప్పాలంటే, అష్టపదులలోని భావ ఝరి.

ఇక ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, ప్రతి ప్రాణి ఆత్మ(జీవాత్మ) ,ఆ పరమాత్మ నుంచి ఉద్భావించినదే! మన పురాణాల పరంగా, మానవ జీవిత పరమార్ధం, జీవాత్మ అనుక్షణం పరమాత్మ కోసం తపించి, జపించి, తిరిగి ఆ పరమాత్మలో లీనమవ్వడమే. దీన్నే మోక్షం అంటారు. కోట్లాది మందిలో కొద్ది మందికో, ఆ ఉన్నతి పొందే అర్హత, జ్ఞానం ఉంటాయి.

భక్తుడు తనను తాను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే *మధుర భక్తి*. ఈ మధుర భక్తి సంప్రదాయమే, అష్టపదుల కావ్య వస్తువు. రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. జీవేశ్వరుల ఐక్యమే, ఇందులోని రహస్యం. ఈ అష్టపదులలో, అష్టాక్షరీ మంతమయిన 'ఓం నమో నారాయణాయ' వలె, ఎనిమిది చరణాలు ఉంటాయి. శ్రీ భాగవతం వలె, 12 భాగాలుగా (సర్గలుగా) విభజించబడింది. అహంకారంతో అలమటించే రాధను చెలికత్తె(ఆచార్యస్థానీయురాలై) బృందావనంలో విహరించే శ్రీకృష్ణ వైభవాన్ని చెబుతూ, శ్రీకృష్ణుని దగ్గరకు చేరమని ప్రోత్సహిస్తుంది. రాధ మధురభాక్తితో, కృష్ణుని చేరడం ఇందులోని విశిష్టత.

ఎల్లప్పుడూ, యమునా తీరంలో ఇసుక తిన్నెల మీద, చల్లని పిల్ల గాలులు వీస్తుంటే, పిల్లన గ్రోవి ఊదుతూ, సంచరించే శ్రీకృష్ణుడిని, నిరంతరం హృదయంలో తలచుకుంటూ, జయదేవుడు ఉన్మాదిగా, కృష్ణాన్వేషిగా, అస్థిరుడిగా తిరిగేవాడు. 19 వ అష్టపది,' ప్రియే..చారుశలే..' లో, రాధ కోపాన్ని తగ్గించడానికి, శ్రీకృష్ణుడి వేడుకోలును వర్ణిస్తూ, 'రాధా,చిగురుటాకుల వంటి నీ కోమలమయిన పాదాలను నా శిరసుపై ఉంచు, అవి నా విరహాగ్నిని ఉపశమింప చేస్తాయి( స్మర గరళ ఖండనం మామ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం..) అన్న చరణాన్ని వ్రాసి, ,దేవుడి తలపై రాధ పాదాలు ఉంచమనడం తప్పని ,భావించిన జయదేవుడు చింతించి ,ఆ చరణాన్ని తొలగించి, స్నానానికి వెళతాడు. తిరిగి వచ్చేటప్పటికి తను మొదట వ్రాసిన పదాలే,అక్కడ వ్రాసి ఉండడం చూసి, ఆశ్చర్యపోతాడు. జయదేవుడి రూపంలో సాక్షాత్తు, ఆ శ్రీకృష్ణుడే వచ్చి, ఆ పదాన్ని పూర్తి చేసి, భోజనం చేసి వెళ్ళాడని, తన భార్య ద్వారా తెలుసుకుని,అమితానందం పొందుతాడు. ఈ విధంగా ఈ కావ్య రచన ద్వారా, జయదేవుడికి భగవత్ దర్శనం లభించింది కనుక, 19 వ అష్టపదిని 'దర్శనాష్టపది ' అంటారు. ఇందులోని పదాలు పంచదారపలుకులు, వర్ణనలు వెన్నెల తునకలు, మాధుర్యం, కోమలత్వం మేళవించిన అపూర్వ కావ్యం…. గీత గోవిందం.

అష్టపది -1

మొదటి అష్టపదిలో,దశావతారాలను స్తుతించి, తన కావ్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని ప్రార్ధిస్తారు, జయదేవులు. 'మత్స్యావతారంలో, వేదాలను ఓడవలె ఉద్ధరించావు, కూర్మావతారంలో, ఇంకా భూమిని మోస్తున్నావు, వరాహావతారంలో, నీ కోరలందు ఎత్తిన భూమి, చంద్రునిలో మచ్చలా నల్లగా ప్రకాశిస్తోంది.

వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంక కలేవ నిమగ్నా ।
కేశవ! ధృత సూకరరూప! జయ జగదీశ! హరే! ॥

నారసింహావతారంలో తామర పూవు లాంటి కొనగోటితో, హిరణ్యకశిపుని చీల్చేసావు, వామనావతారంలో ముల్లోకాలు ఆక్రమించి, నీ కాలి గోటి నుంచి గంగా నదిని సృష్టించావు.

తవ కరకమల వరే నఖమద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ! ధృత నరహరిరూప! జయ జగదీశ! హరే! ॥


శ్రీరాముడివై, లోకక్షేమం కోసం దశకంఠుడిని కూల్చావు. బలరామ రూపంలో నాగలి దెబ్బకు,యమునానది పరుగెత్తి నీ వైపు వచ్చేలా చేసావు. కృష్ణావతారంలో, పశుబలి నిరోధించావు, కల్క్యవతారంలో తోకచుక్క వంటి కత్తితో, దుర్మార్గులను సంహరించడానికి అవతరిస్తావు.'అంటూ కీర్తిస్తారు.


వేదానుద్ధరతే జగంతి వహతే భూగోళ ముద్బిభ్రతే
దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే ।
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః ॥


*********************************************************************************


అష్టపది -2
శ్రిత కమలా కుచమండల! ధృత కుండల! ఏ
కలిత లలిత వనమాల! జయ జయ దేవ! హరే! ||


దినమణిమండల మండన! భవ ఖండన! ఏ
మునిజనమానస హంస! జయ జయ దేవ! హరే! ॥


కాళియ విషధర గంజన! జన రంజన! ఏ
యదుకులనళిన దినేశ! జయ జయ దేవ! హరే! ॥


రెండవ అష్టపదిలో, శ్రీకృష్ణుడి గుణ రూప వర్ణన. 'పాదాల వరకు తులసి మాల ధరించినవాడు,కుండల ధారి, ముని మానస సంచారి, యదు కులోద్ధారి, కాళీయ సంహారి, సూర్యమండలాన్ని వెలిగించేవాడు, రాక్షస సంహారి, భాక్తజనోద్ధారి, నవ నీల మేఘ సుందరుడు, మంధర ధారి,మునుపు రామావతారి, అగు శ్రీకృష్ణుడి పాద పద్మాలకు మంగళం.' అంటూ మంగళ గీతం
సమర్పిస్తారు.


శ్రీ జయదేవ కవేరిదం కురుతే ముదం ఏ
మంగళముజ్జ్వల గీతం జయ జయ దేవ! హరే! ॥


*********************************************************************************


అష్టపది -3


3 అష్టపదిలో , అద్భుతమయిన బృందావన వర్ణన ఇవ్వబడింది ...


వసంత ఋతువులో కృష్ణ విరహంతో, కృష్ణుడిని వెతుకుతూ, వడిలిన అడవి మల్లె పువ్వు లాగా , సుకుమారమయిన శరీరంతో విహరిస్తున్న రాధతో, చెలికత్తె, ఇలా అంటున్నది.


మన మనసులు కూడా గోపికలై, యమునా తీరవిహారి అయిన కృష్ణుడిని, వేణు గాన సమ్మోహనుడిని, బృందావనంలో దర్శిస్తున్నట్టుగా భావించుకుందాం. బృందావనం...


లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే ।
మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే ॥


విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి
యువతీ జనేన సమం సఖి! విరహి జనస్య దురంతే ॥


వసంత ఋతువు... చల్లని గాలి కోమలమయిన లవంగ తీగల పైనుంచి వీస్తోంది... తుమ్మెదల ఝుంకారాలు , కోకిల రావాలు కలసి, పొదరిళ్ళలో ప్రతిధ్వనిస్తున్నాయి. పొగడ పూల గుత్తుల మీద వాలే గండు తుమ్మెదలతో నిండు వసంతం ప్రకాశిస్తోంది.


కానుగ చెట్లను అల్లుకున్న చిగురుటాకులతల నుండి, కస్తూరి వాసనలు విరజిమ్ముతున్నాయి. విరహాన్ని చీల్చే ,మన్మధుడి పదునయిన గోళ్ళ వంటి మోదుగ పూలతో వసంత ఋతువు శోభాయమానంగా ఉంది.


మదన మహీపతి కనక దండ రుచి కేసరకుసుమ వికాసే ।
మిళిత శిలీముఖ పాటల పటల కృత స్మర తూణ విలాసే ॥


మన్మధరాజుకు పట్టిన బంగారు గొడుగులా ఉన్న నాగకేసర పుష్పాలు( నాగమల్లి పూలు) గమ్మత్తయిన పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పాటల పుష్పాలపై గుంపులుగా వాలిన తుమ్మెదలు, మన్మధుడి అంబుల పొదిలా కనిపిస్తున్నాయి.


వికసించిన మొగలి పూలు, తెల్లటి కరుణ వృక్షాల పూలు, మన్మధుడి 'కుంతలమనే' ఆయుధం లాగ, విరహుల గుండెలు రగులుస్తున్నాయి.


మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ ।
ముని మనసామపి మోహనకారిణి తరుణా కారణ బంధౌ ॥


గురివింద తీగలు అల్లుకున్న మామిడి చెట్లతో,మాలతీ, మాధవీ పూల వాసనలు గుబాళిస్తుండగా, మునులను సైతం లొంగ దీయగల పరిమళం అంతటా వ్యాపించి ఉంది.


యమునా నదీ జలాలతో పవిత్రమయిన ఆ బృందావనంలో, కృష్ణుడు ప్రియురాండ్లతో కలిసి, ఆనందంగా ఆడుతూ, పాడుతూ విహారం చేస్తున్నాడు. ఆ ప్రదేశానికి పోదాం రావమ్మ, రాధా!


దర విదళిత మల్లీ వల్లి చంచత్పరాగ
ప్రకటిత పట వాసైర్వాసయన్కాననాని ।
ఇహ హి దహతి చేతః కేతకీ గంధ బంధుః
ప్రసర దసమబాణ ప్రాణవద్గంధవాహః ॥


అప్పుడే విరిసే మల్లెల పరిమళాలను, గేదంగి పూల పరిమళాలను మోసుకొస్తున్న వసంత గాలి,మన్మధుడి ప్రాణ వాయువులా ఉంది. మావి చిగురులు తిన్న కోకిలా రావాలు, మకరందం త్రాగిన గండు తుమ్మెదల ఝుంకారాలు, బాటసారుల మనసులో, తమ ప్రియురాళ్ళ తలపులను రేపుతూ, ఆరాటపెడుతున్నాయి. ఇట్టి వసంతంలో, అనేక నారీమణుల మధ్య సమీపంగా, క్రీడిస్తున్న కృష్ణుడిని, రాధకు చూపిస్తూ, చెలికత్తె, ఇలా అంటున్నది.
****************************************************************************
అష్టపది -4


చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ ।
కేలి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ ॥
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరే ॥


'ఓ రాధా, చందనము పూసిన నల్లని దేహము కలవాడు, పీతాంబరం( పసుపు పట్టు వస్త్రం),తులసిమాల ధరించినవాడు, చెవులకు కదలాడే మణి కుండలాలు ధరించిన వాడు, అయిన కృష్ణుడు, ముగ్ధలయిన గోపికలతో నవ్వుతూ, విలాసంగా ఉన్నాడు.


పీన పయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం ।
గోప వధూరనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగమ్‌ ॥
కాఽపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం ।
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజమ్‌ ॥


ఒక గోపిక కృష్ణుడి నేత్ర విలాసం వల్ల, మోహ వశురాలై, మైమరచి, అతడి ముఖాన్నే చూస్తోంది. మరొక గోపిక కృష్ణుడిని, ఆలింగనం చేసుకుంటోంది, మరియొక గోపిక జలక్రీడలకు కృష్ణుడిని ఆహ్వానిస్తోంది. ఒక యువతి, అతని వేణు గానానికి అనుగుణంగా, గాజుల చప్పుడుతో నృత్యం చేస్తూ, అతడి మెప్పు పొందుతోంది.


కాఽపి కపోల తలే మిలితా లపితుం కిమపి శ్రుతి మూలే ।
చారు చుచుంబ నితంబవతీ దయితం పులకై రనుకూలే ॥
కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునా జల కూలే ।
మంజుల వంజుల కుంజ గతం విచకర్ష కరేణ దుకూలే ॥
కర తల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే ।
రాసరసే సహ నృత్య పరా హరిణ యువతీ ప్రశశంసే ॥


కృష్ణుడు ఒక కాంతను కౌగిలించు కొనుచున్నాడు, ఒక భామను ముద్దులాడుతున్నాడు, ఒకామె వెంట పడుతున్నాడు, ఒక కాంతను సంతోషపెడుతున్నాడు. అలా మనోహరుడయిన ఆ హరి,అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ, నల్ల కలువల వంటి కోమలమయిన అవయువములతో మదనోత్సవం జరిపిస్తూ, గోపికల అంతరంగం, బహిరంగము చేతా ప్రేమించ బడుతున్నవాడై, విహరిస్తున్నాడు.


శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం ।
పశ్యతి సస్మిత చారు తరామపరామనుగచ్ఛతి వామామ్‌ ॥
శ్రీ జయదేవ భణితమిద మద్భుత కేశవ కేళి రహస్యం ।
బృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యమ్‌ ॥


ఆ సమయంలో, ప్రేమాతిశయం చేత పరవశించిన రాధ, కృష్ణుని కౌగలించుకుని, 'కృష్ణా! నీ వదనము సుధామయము. అందుకే, నీవు పాడే ప్రతి గీతం అమృతమయంగానే ఉంటుంది,' అని పొగుడుతూ, ఆ నెపంతో చుంబిస్తూ ఉండగా, ముగ్ధమనోహరంగా నవ్వుతూ ప్రకాశిస్తున్నాడు కృష్ణుడు.


ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి. ప్రతి ప్రాణి, భగవంతుడిని అన్వేషిస్తూ, ధ్యానిస్తూ, తమకు అత్యంత ఆప్తుడు భగవంతుడేనని భావిస్తూ,తమ కష్టాలను నివారించమని, జ్ఞానాన్ని ప్రసాదించి, మంచి నడవడిక ఇవ్వమని, తమకి తోడూ- నీడగా ఉండమని, భగవంతుడికై తపిస్తూ ఉంటుంది. సూక్ష్మంగా, ఆత్మ తన మజిలీ అయిన పరమాత్మకై అతని ప్రేమకై, అనుగ్రహానికై తపిస్తుంది. అయితే అందరికీ ఆధ్యాత్మికంగా అంత స్థాయి, పరిణితి ఉండకపోవచ్చు. భగవంతుడు కరుణామూర్తి కనుక 'యద్ భావం తద్ భవతి...' అంటే, ఎలా ఎవరు కోరుకుంటారో, అలా అనుగ్రహిస్తాడు. ఎంతో గొప్పదయిన ఈ రహస్యం, సులభంగా మనకు అర్ధం కావడానికి,జయదేవకవి గోపికల పరంగా, రాధ పరంగా రచించి మనకు అందించారు.


అందుకే, కేవలం ఈ కావ్యాన్ని, కేవలం శృంగార పరంగా కాక, ఆధ్యాత్మిక పరంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మరి భగవంతుడు మనను సరిగ్గా అనుగ్రహించడం లేదని, తన పక్కవారినే చక్కగా వెన్నంటి కాపాడతాడని, కోరిన కోరికలన్నీ తీర్చట్లేదని, ఆయన మీద అలిగేస్తాం కదా! ఇదే భావం రాధ పరంగా చెబుతున్నారు కవి. కృష్ణుడు అందరు స్త్రీలను, తనతో సమానంగా భావించడం, రాధకు ఈర్ష కలిగించింది. తను, మిగిలిన గోపికలు సమానం ఎలా అవుతారు. తన పట్ల ఎక్కువ ప్రేమ చూపించాలి కదా! అందుకే అలిగి, ఒక పొదరింట చేరి, దుఖంతో, తన చెలికత్తెతో ఇలా అంటున్నది...


*****************************************************************************
అష్టపది 5 :
'ఓ చెలీ, కృష్ణుడు నన్ను లెక్క సేయక, పరిహసించినా, నా మనసు ఆ వేణుగాన సమ్మోహనుడినే కోరుకుంటోంది. మేఘాల్లో ఇంద్రధనస్సులా, నల్లని కేశాల్లో గుండ్రటి నెమలి పింఛము ధరించిన కృష్ణుడు, నాలో ఉన్నాడు.


మంకెన పువ్వు వంటి ఎర్రనయిన పెదాలపై చిరునగవుతో ప్రకాశించేవాడు, తన మణి భూషణాల కాంతితో, చీకటిని పోగొట్టు వాడు అయిన కృష్ణుడు నాకు గుర్తొస్తున్నాడు. మేఘాల మధ్య చందమామలా- నుదుట కస్తూరి తిలకం ధరించినవాడు, నా కొరకు రావి చెట్టు మొదట ఎదురు చూసేవాడు, నా మానస చోరుడు, కలి కల్మషము నివారించువాడు, అనేక మంది పులకిత గోపికలచే చుట్టబడినవాడు, నారదాది మునులచే, ఇంద్రాది దేవతలచే సేవింపబడుతున్నవాడయిన , ఆ మోహనుడినే, నా మనసు స్మరిస్తున్నది...' నన్ను విడచి ఇతరులతో క్రీడించువాడునూ, యువతులలో ఎంతో తృష్ణ గలవాడును అయిన కృష్ణుని మరలా నామనస్సు కోరుకొనుచున్నది. నా మనసు అతని గుణగానమే చేయుచున్నది. భ్రమచేతనైనా అది అతని పట్ల కోపము పొందదు. అతని దోషములను మరచుచున్నది. పైగా సంతోషము పొందుచున్నది. ఏమి చేయనే చెలీ!


ఓ సఖి, చిన్న చిన్న పువ్వుల గుత్తులతో సొగసైన అశోక వృక్షములు గల సరస్సులతో, విరాజిల్లు ఉద్యానవనములలోని గాలి
సయితం నన్ను బాధిస్తున్నది. తుమ్మెదల గానముచే రమణీయమైన శిఖరాలు గల మామిడి చెట్ల మొగ్గలు సైతం నాకు సుఖకరంగా లేవు. తియ్యటి చిరునవ్వు మాటలతో, నన్ను మురిపించువాడు, నా అనురాగాన్ని అర్ధం చేసుకుని, నన్ను రంజింప చేయువాడు, అయిన కృష్ణుడికి, నామనసు తెలిపి, ఇక్కడికి తీసుకురావే!' అంటూ, తన విరహ వేదనను అంతా వివరించి, అభ్యర్దిస్తుంది రాధ.


మిత్రులారా, నిజమయిన మనసు భగవంతుడి భావనలో లీనమయినప్పుడు, మన స్థితి అతనికి విన్నవించాలా? అక్కడ రాధ మనసు తెలిసిన మాధవుడిది, అదే పరిస్థితి. రాధను బాధించితినే, అని పశ్చాత్తాప పడుతున్న గోవిందుడు, గోపికలందరినీ త్యజించి, రాధని వెదుకుతూ, ఒక పొదరింటిలో విషాదంగా కూర్చుని, తనలో తను ఇలా అనుకుంటున్నాడు,' గోపికలతో కూడి ఉన్న నన్ను చూసి, రాధ అలిగి వెళ్ళిపోయింది. నేను అపరాధిని కాబట్టి వెళ్లోద్దని, చెప్పలేకపోయాను. నా ప్రియురాలు, రాధ లేని నాకు ధనమెందుకు, ఇల్లెందుకు, జీవితమెందుకు? కోపంతో ఎర్రబడ్డ రాధ మొహం, తనపై వాలే తుమ్మెదలను చూసి, చికాకుపడే ఎర్రతామరలా ఉంది. అయినా, నేను ఎక్కడో రాధను వెదుకుతూ,బాధపడడం ఎందుకు?


నా మనసులోనే ఉన్న రాధకు, నా వేదన విన్నవించుకుంటాను. ఓ చెలీ! నా అపచారం వల్ల నీవు మనసు కష్టపెట్టుకున్నావు. లేకపొతే, ఎందుకు నన్ను విడిచి వెళతావు? నీకు దణ్ణం పెడతాను, బ్రతిమాలుకుంటాను. నన్ను మన్నించు. నీవు నా ఎదుటే తిరుగుతున్నట్టు , నాకు అనిపిస్తోంది. నన్ను కరుణించి, నీ దర్శన భాగ్యం ఇప్పించు.'


చూసారా, దేవ దేవుడికి ఎంత నిరాడంబరతో. నిజమయిన మనసుతో ఆర్తిగా తపించే, భక్తుడి కోసం భగవంతుడూ, అంతగానే తపిస్తాడు. భక్తి మార్గం దుర్లభం, ప్రేమ మార్గం సులభం. అందుకే, జయదేవ కవి,ప్రేమను కావ్య వస్తువుగా ఎన్నుకున్నారు. అంతర్లీనంగా భక్తి సందేశాన్ని ఇచ్చారు. రాధ అంత ప్రేమతో తపిస్తే, అది ఆమె మనసులోనే ఉన్న కృష్ణుడిని చేరకుండా ఎలా ఉంటుంది? భగవంతుడయినా సులభుడే. ప్రేమంటే ఏమిటి? నేను, నాది అన్న ఎల్లలు ,అహంకారం చెరిగిపోయి, మనము, మనది అన్నబంధంతో అల్లుకుపోవడమేగా! నువ్వు లేని నేను అసంపూర్ణమని, వ్యర్ధమని, భావించడమేగా.


కృష్ణుడు, మన్మధుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు, 'ఓ మదనా, ప్రియురాలు లేని నన్ను శివుడిగా భావించి, నాపై నీ పుష్ప బాణాలు విసరకు. నా మెడలోని తామరతూడుల హారాన్ని, సర్పమని భావించకు. చందనమును భస్మము అనుకోకు, మెడకు అంటిన నల్ల కలువ రేకులు విషము కాదు. అసలే నేను నా ప్రియురాలి కనుబొమలనే విల్లు నుంచి, ఎక్కుపెట్టిన చూపులనే బాణ పరంపరతో గాయపడి ఉన్నాను.


నల్లటి పెద్ద జడ, వెచ్చటి స్పర్శ అందమయిన ముఖ కవళికల విలాసాలు, దొండపండు లాంటి పెదవులు, చక్కటి వాక్చాతుర్యం, ఎంతటి ముగ్ద రాధ! నీ అస్త్రాలన్నింటిని, రాధాలో అమర్చి, నాపై సంధించావా? లేకపొతే, నా మనసు ఎంతగా ఆమెలో లీనమై, ఆరాధిస్తూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా, విరహ వేదన ఎందుకు తగ్గడంలేదు?'అలా ,యమునా తీరంలోని పొదరింటిలో , నిరాశగా ఉన్న కృష్ణుడి వద్దకు రాధ చెలికత్తె వచ్చి ఇలా అంటోంది. చెలీ వర్ణనలు అద్భుతంగా ఉంటాయి, చదవండి.


(సావిరహే తవ దీనా... 8 వ అష్టపది)
'ఓ కృష్ణా, నీ ఎడబాటు వల్ల దుఖితురాలయిన రాధ, మన్మధుడి బాణాలకు భయపడి, నీ మనసులోనే దాక్కుంటోంది. చల్లటి
చందనాన్ని, చందన వృక్షపు గాలులను, విషంగా భావిస్తోంది. చంద్రకిరణాలను దూషిస్తోంది. మన్మధుడు తనపై సంధించే బాణాలు, తన మనసులో ఉన్న నీకు తగిలి, నిన్ను బాదిస్తాయేమో, అని తామారాకులను తన ఎదపై కవచంగా ధరిస్తోంది. కుసుమ తల్పంపై, నీ విరహంతో, మేఘములవలె కన్నీళ్ళు కురిసే కళ్ళతో, రాహువు కొరికిన చంద్రుడిలా ఉంది రాధ. కస్తూరితో నీ రూపాన్ని చిత్రించి, భరించరాని వేదనతో, నిన్నే తలస్తూ, వెర్రిగా నవ్వుతూ, పరిగెడుతూ, ఏడుస్తూ, నిన్నేధ్యానిస్తున్నది. 'ఓ గోవిందా! నీ చరణాలను ఆశ్రయిస్తాను, నన్ను కరుణించు,' అని ప్రార్ధిస్తున్నది.


'ఓ కృష్ణా! రాధ నీ వియోగం వల్ల కృశించినది. ఆమె తన నిట్టూర్పులనే కార్చిచ్చుచే దహింపబడుతోంది. కాడలూడిన కమలము లాగ, కన్నీరు నిండిన కళ్ళతో, నువ్వు వస్తావేమోనని,మాటి మాటికీ, ప్రతి దిక్కును చూస్తోంది. వియోగ బాధతో మరణించు దాని వలె, 'హరీ, హరీ' అని జపిస్తోంది. అయినా, నీ క్షణకాల విరహాన్ని భరించలేని రాధ,ఇంత సుదీర్ఘ ఎడబాటును ఎట్లు భరించగలదు? ఈ స్థితి నుండి ఆమెకు విముక్తి కలికించని ఎడల, నీవు వజ్రము కన్నా కఠినుడవని, అనిపించుకోగాలవు సుమా !.' అంది.


అప్పుడు చెలితో, కృష్ణుడు, తాను ఒక పూతీగ వద్ద ఉంటానని, రాధను అక్కడికి తీసుకు రమ్మని, చెబుతాడు. సఖి రాధను చేరి, తనతో ఇలా అంటున్నది.


'రాధా, కృష్ణుడు నీ వియోగంతో ఎంతో బాధ పడుతున్నాడు. వికసించే పూవులు, చల్లని గాలి, చంద్ర కిరణాలను నిందిస్తున్నాడు. తుమ్మెదల ఝుంకారాలు వినలేక, చెవులు మూసుకుంటున్నాడు. మనోహరమయిన తన గృహాన్ని వదిలి, అడవుల వెంట తిరుగుతున్నాడు. అంతటి ఆ కృష్ణపరమాత్మ నేలమీద దొర్లుతున్నాడు.. వైశాఖ మాసాన్ని, రాధా మాసమని అందరూ అంటుంటే, ఆ మాసాన్నిస్మరిస్తూ ఉన్నాడు, అన్య కాంతలను కోరట్లేదు. వనమందు పక్షి రెక్క పడినా, ఆకు కదలినా, నువ్వు వస్తున్నావని, ఎదురు చూస్తున్నాడు. నీ మేని ధూళి సోకినా చాలని, భావిస్తున్నాడు. నువ్వు పక్కనున్నప్పుడు, నీ మెడలోని
ముత్యాల హారం, నల్లని కృష్ణుడి పై పడినప్పుడు, అతడు, తెల్లని కొంగలున్న మేఘములా ప్రకాశిస్తాడు.అప్పుడు నీవు మేఘం పై మెరుపులా వెలుగుతావు.


బంగారు వన్నె కల రాధా, విశాల నేత్రీ ! యమునా తీరంలో, వేణువుపై నీ పేరుతో కృష్ణుడు పాడుతున్నాడు. గోవిందుని విచారమయిన మనసులా, అంతటా చీకటి అలముకుంది. ఎంతో అభిమానం కల కృష్ణుడిని, ఆలస్యం చెయ్యక చేరుకో.' అని చెప్పింది.


గోవిందుడి వద్దకు వెళ్ళడానికి కూడా, శక్తి లేని రాధ, పొదరింటి వద్దకు, కృష్ణుడినే తీసుకురమ్మని పంపుతుంది. చెలి కృష్ణుని చేరి, ' కృష్ణా, రాధ నీ దగ్గరకు రావాలని, ఆనందోత్సాహముతో బయలుదేరి, విరహవేదన చేత అడుగులు తడబడగా, నడవలేక నేలపై పడిపోతున్నది. నీ కోసం అన్నీ దిశలా వెదుకుతున్నది. తనను తాను చక్కగా అలంకరించుకుని, తానే నీవని భ్రమిస్తోంది. చీకటినే, నీవనుకుని, కౌగిలించుకుంటోంది.'అని రాధను గురించి వివరిస్తుండగా, చంద్రోదయమయ్యింది. బృందావనమంతా, పండు వెన్నెల వ్యాపించింది. చంద్రోదయం మూలంగా, రహస్యంగా కలసుకోవడం కుదరదు కనుక, కృష్ణుడు లేకుండా, విషాదంతో, నోట మాట రాక, ఒంటరిగా వచ్చిన సఖిని చూసి, రాధ కృష్ణుడిని అపార్ధం చేసుకుని, నిందిస్తుంది. 'అయ్యో, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నా రూపం, వయసు, అందం అన్నీ వ్యర్ధములయినవి. ఈ వసంత వెన్నెల రాత్రి విరహాగ్నిని భరించే కన్నా, మరణమే మేలు. సఖీ, చింతించకు, అతని నిర్దయకు, నా గుండె పగిలి, అతని యందు లగ్నమయ్యి ఉండుట వల్ల, అతని వద్దకే వెళుతుంది చూడు. ఒకనాడు తెల్లవారు జామున,మేమిరువురము, మందిరము నుంచి బయటకు వచ్చినప్పుడు, పొరబాటున, నా నల్లని వస్త్రాన్ని కృష్ణుడు, కృష్ణుడి పీతాంబారాన్ని నేను, ధరించాము. అప్పుడు , చెలులు నవ్వుతుండగా ,సిగ్గు పడుతున్న నన్నుచూసీ, చిలిపిగా నవ్వుతున్న ఆ కృష్ణుడిని తలుస్తూ, ప్రాణములు విడుస్తాను.'


అలా రాత్రంతా, కృష్ణుడి తలపులతో గడిపిన రాధ, ప్రభాత సమయంలో, వినయంగా తన ముందు నిలబడి, తన తప్పును మన్నించమని వేడుకుంటున్న కృష్ణుడితో, ఇలా అంటున్నది...


రాధ తన వద్దకు వచ్చిన కృష్ణుడిని, ఇలా నిందిస్తోంది. 'ఓ కేశవా! పోపోమ్ము. మాయా మాటలాడకు. రాత్రంతా, నీ విషాదము తీర్చిన ఆ వనిత దగ్గరకే పొమ్ము. ఎర్రనయిన నీ కన్నులు, కాటుక కనులను చుమ్బించుట వల్ల నల్లబారిన నీ పెదవులు, చూస్తే మన ప్రేమ భంగమయినదని తెలుస్తోంది. నీ మనస్సు లాగ శరీరము కూడా అపవిత్రమయ్యింది. నీవు అబలలను కబలించడానికే తిరుగుతున్నావు. బాల్యంలోనే పూతనను చంపిన నిర్దయుడవు. నిన్ను చూస్తుంటే, దుఃఖం కంటే, సిగ్గు, బాధ కలుగుతోంది. ఇక వెళ్లు...'
రాధచే తిరస్కరింపబడిన కృష్ణుడు అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. అప్పుడు చెలి మళ్ళి రాధను సముదాయించి, కృష్ణుడి వద్దకు పంపే ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి. దేవదేవుడు-


గురువు- జీవుడు, ఈ పాత్రల్లో కృష్ణుడు- రాధ చెలి- రాధ ను ఊహించుకోవాలి. జయదేవ కవి,రాధా క్రిష్ణులని నేరుగా కలపక, ఇన్ని మలుపులు ఎందుకు పెట్టినట్టు? మనం పుట్టింది దేవుడిని తెలుసుకుని, ఆరాధించి, మంచి మార్గంలో ప్రయాణించి, చివరికి అతన్ని చేరుకోడానికి. ఇది ఒక్క జన్మలో సాధ్యం కాదు.




అనేక జన్మల సంస్కారమే, మోక్షానికి దారి తీస్తుంది. మనం దేవుడి వద్దకు వెళ్ళడానికి సుముఖంగా ఉండం. ఉదాహరణకు, వేడుకలకు, విందులకు, విహారాలకు, సినిమాలకు సంబరంగా వెళ్ళే మనం, గుడికో, భజనకో వెళ్ళమంటే, 'ఇప్పుడు కాదులే, మళ్ళి ఇంకోసారి చూద్దాం,' అంటూ వాయిదా వేసేస్తాం. నిజానికి భగవంతుడు కూడా నిజమయిన భక్తుల కోసం పరితపిస్తాడు. మనం నిరాకరించినా బెట్టు చేసినా,తిరస్కరించినా, తన బిడ్డలను యే నాడు తిరస్కరించని తల్లిలా,నదులను వెనక్కి తిప్పి పంపని సముద్రంలా,దయాళువై ఉంటాడు.


ఆలోచించండి, దేవుడిని తిరస్కరించేన్త వాళ్ళమా మనం? సద్గురువు, దేవుడికి మనకు ఉన్న'మత్సరం'(ego) అనే మంచు తెరను తొలగించి, కరిగించి,మనల్ని దేవుడి వద్దకు చేర్చే ప్రచండ సూర్య కిరణం వంటి వాడు.


ఇక్కడ చెలి కూడా అదే పాత్రను పోషిస్తూ, ఇలా చెబుతోంది.


' ఓ మానవతి! కృష్ణుడిపై ఊరికే కోపించకు. మనస్సును ఆకర్షించు గోపాలుని విడువకు. ఈ మాట ఎన్నో సార్లు చెప్పి ఉన్నాను. ఇది మరువకు. కృష్ణుడిని సేవించి, నీ జన్మ సఫలం చేసుకో. మదిలో అంత పడతావెందుకు?


నీ ప్రియుడు నీ యెడల అనురాగం కురిపించినా, ఎందుకు ద్వేషిస్తూ మాట్లాడతావు? అతడు ప్రమాణం చేస్తున్నవినిపించుకోవు. అతడు ఇష్టపడుతుంటే, నువ్వు అయిష్టంగా ఎందుకు ఉన్నావు? నీ విపరీత ప్రవర్తన వల్ల చందనం విషంగాను, చంద్రుడు సూర్యుడిలాగాను, హిమము అగ్నివలెను, ఆనందము యాతన గాను మారి, నిన్నే కాల్చేస్తున్నాయి. అతడు మళ్ళి నీ దగ్గరకు వచ్చి, మధురమయిన పలుకులు పలుకుతాడు, నిరాకరించకు' , అంటూ చెబుతుంది. శ్రీహరి, బిడియంతో, రాధను చూస్తున్న ఆనందంతో తడబడుతూ వచ్చి, రాధతో ఇలా అంటున్నాడు.


'మంచి శీలము కల ఓ ప్రియురాలా! నా పై అనవసరంగా కోపించకు. నీవు మాట్లాడితే,నీ దంతముల కాంతి అనే వెన్నెలతో, నాలోని భయం అనే చీకటి తొలగిపోతుంది. నా నయన చకోరాలకు, చంద్ర బింబము లాంటి నీ ముఖమే, ఆనందం కలిగిస్తోంది. నా పై కోపమయితే, నన్ను గిల్లు, బంధించు, కొరుకు, నీకు తోచిన శిక్ష విధించు. నీవే నా ఆభరణం, జీవనం. నీకు నమస్కరిస్తున్నాను. నన్ను ప్రేమతో అంగీకరించు, నా మనస్సుఅందుకోసమే ప్రయత్నిస్తోంది. ఎర్ర కలువల వలే ఉన్న నీ చూపులనే మన్మధ బాణాలు, నన్ను ఎర్రగా చేస్తే, నేను ఇంకా అందంగా కనిపిస్తాను. నీ ఆభరణాల కాంతిలో నన్ను వెలగనివ్వు. అందమయిన నీ పాదాలకు పారాణి పూస్తాను. చిగురుటాకు లాంటి నీ పాదాలను, నా తలపై ఉంచు. అవి, నా మదనాగ్నిని దహింప చేస్తాయి. నీవు ఈ భూమిపై ఉన్నదేవ కంతవు . నన్ను నమ్ము, నీవు తప్ప నా హృదయంలో వేరెవరు లేరు.


ఓ తరుణీ, నీ మౌనం విడనాడు. నీ చూపులతో, నా తాపాన్ని తొలగించు. ఎంతో ప్రేమతో నీ దగ్గరకు వచ్చాను, నన్ను తిరస్కరించకు. ' కృష్ణుడి అనునయ వాక్యాలకు, రాధ శాంతించి, చక్కగా అలంకరించుకుని, కృష్ణుడిని చేరుతుంది. దేవదేవుడే, నీ పాదములు శిరసుపై పెట్టుకుంటాను, అంటే, ఎంతటి అహంకారమయినా, ఇట్టే కరిగిపోతుంది.


చంద్రుడిని చూసి, ఉప్పొంగిపోయే సముద్రంలా, రాధను ముఖం చూసి , మాధవుడి హృదయం సంతోషంతో పొంగిపోతోంది. అదే సమయంలో, మన్మధ జనకుడయిన కృష్ణుని, రాధ చూసింది. కృష్ణుడు రాధను ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో, రాధ మెడలోని ముత్యాల హారం యొక్క కాంతి, కృష్ణుడి ఎదపై బడి, అతడు తెల్లని నురుగుతో మెరిసే నల్లని యమునా నదిలా ఉన్నాడు. పీతాంబరం కట్టుకున్న నల్లనయ్య,రాధకు, పచ్చటి పుప్పొడి కప్పిన నల్ల కలువ వలే అనిపిస్తున్నాడు. రాధ ముఖ కమలాన్ని చూడడానికి వచ్చిన సూర్యుడిలా కనిపిస్తున్నాడు, కృష్ణుడు. నల్లని కేశాల్లో, తెల్లటి పూలు ధరించిన కృష్ణుడు, మధ్యను వెన్నెల గల నల్లని మేఘంలా అనిపిస్తున్నాడు. అలా వచ్చిన రాధతో కృష్ణుడు ఇలా అంటున్నాడు,' ఓ రాధా! అప్పుడే వికసించిన పూల కన్నా, సుకుమారమయిన నీ పాదాలను, ఈ పూల పాన్పు పై ఉంచి, వాటి గర్వము అణచుము. ఎంతో దూరం నా కోసం నడచి వచ్చావు, శ్రమ తీరునట్టు, ఒత్తెదను. నా లాగా ,ఎల్లప్పుడూ, నీ వెంట ఉండే కాలి అందెలను, పాన్పు పై ఉంచుము. మధురమయిన నీ మాటలతో, నన్ను ఆనందింపజేయుము. నీ ఎడబాటుతో, చచ్చిన వాని వలే ఉన్న నన్ను, నీ అధరామృతము నిచ్చి, బ్రతికించుము. ఈ కృష్ణుడు నీ దాసుడు, నన్ను స్వీకరించుము.'

పిమ్మట రాధా కృష్ణులు అనురాగాచిత్తులై, బాహ్య ప్రపంచము మరచి, ఏకమయ్యిరి. కృష్ణుడు చెదరిన రాధ అలంకారములన్ని, తిరిగి సరిచేసి, ఆమె సౌందర్యమును చూసి ఆనందించెను.

ఇవి నాద బ్రహ్మ త్యాగయ్య, చిన్నప్పుడు పూజామందిరంలో నిత్యం ఆలపించిన కీర్తనలు. అన్నమయ్య తన భక్తికీర్తనల్లో, కొనియాడిన కీర్తనలు. ఆచార్యులు అంగీకరించిన,ఆళ్వారులు అనుసరించి,అనుభవించిన మధుర భక్తి రస 'ఇష్టపదులు'.
జయదేవ కవి కృత ఈ కావ్యము చదివిన వారికి, ఆ బృందావన విహారి కృప కలిగి,సకల శుభములు చేకూరుగాక!....
****