Saturday, July 9, 2016

//గురు హృదయం//

//గురు హృదయం//
---------------------------
భావరాజు పద్మిని - 15/5/16

కొందరు బిడ్డలె ఒక్కతల్లికి 
అందరు బిడ్డలె అమ్మగురునికి 
అక్కున చేరిచి ఆదరించును 
కంటికి రెప్పగ కాచుచుండును.

తాను తిన్నను బిడ్డడి ఆకలి,
కన్నపేగును కలచివేయును. 
శిష్యుల పస్తు గురువుకు బరువై,
కడుపునింపగా కలవరపడును.

నిద్దుర చాలక నీరసపడినా 
అలసట కమ్ముచు ఆవరించినా 
తరుణోపాయము తక్షణమేనిచ్చును 
హితులనుకొను పగవారిని జూపును.


చేయి పట్టుకొని నడకలు నేర్పి,
ముక్తిమార్గమును తాను చూపును 
విద్యాబుద్ధులు అక్కరలు దీర్చి,
ఆపదలందున ఆదుకొందును.

మంచిని పెంచగ నడవడి తెలిపి,
మార్గము మార్చగ మందలించును 
దానము సేవ ధర్మము నేర్పును 
మాటల జెప్పక చేసి చూపును.

అన్నీ ఉన్న బిడ్డడి కన్నను, 
కొరతలు ఉన్న బిడ్డని మీదనె 
మమత ఎక్కువట మాతృమూర్తికి 
అదియె సత్యము తల్లిగురువుకు.

బిడ్డ ఎదుగుతూ తల్లిని మరచిన 
తన సంతోషమె తగని పెన్నిధని 
దూరమునున్నా పూజలు చేయును 
గురువటులె వీడక క్షేమము కోరును.

పేగు బంధమా ప్రేమ పాశమా 
ఏది గొప్పయని తరచి చూచిన
ఏమరుపాటున తల్లి మరచినా 
గురువు వీడరు జన్మజన్మలా.

(పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ కృపావాహిని )

No comments:

Post a Comment