Saturday, September 3, 2016

నీడ చెప్పిన నిజం

ఒక స్థితిలో భక్తుడి మనసు భగవంతుడిలో లయమైపోతుంది. ప్రతి శ్వాసలో , ప్రతి స్పర్శలో , ప్రతి పిలుపులో , ప్రతి ప్రాణిలో అనంతుడి స్వరూపమే గోచరిస్తుంది. జీవాత్మ పరమాత్మలో లయమైన అద్వైత స్థితి అది. పరమాత్మ దయ ఉంటే తప్ప, ఆ స్థితి భక్తుడికి త్వరగా అవగతం కాదు. కృష్ణారాధిక రాధిక కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. 'నల్లనయ్య లాగే నీవూ కృష్ణ వర్ణంలోనే ఉంటావు కదూ, నాలో ఈ తృష్ణ ఎందుకో చెప్పవూ...' అని యమునమ్మను అడిగింది. ఆమె ఏమి చెప్పిందంటే...

నీడ చెప్పిన నిజం 
-------------------------
భావరాజు పద్మిని  - 11/3/15

తనువు తాకే అనిలమైనా 
అనంతుడేనన్న అనుభూతి !

కన్నులు కాంచే ప్రతి రూపూ 
కన్నయ్యేనని కనికట్టు !

వీనుల మ్రోగే ప్రతి రవము 
మురళీధరుడని మైమరపు !

కలనైనా, మెళకువనైనా 
నల్లనయ్య మధుమురళీ రవళి !

పున్నమి సంద్రంలా ఎగసే,
అలౌకిక ఆనందతరంగం !




అంతలోనే చీకటి మబ్బులా, 
మనసును కమ్మే నిర్వేదం !

చెట్టూ, పుట్టా, చేమ, అంతటా 
లీలామోహనుడి లాస్యమే !

దృశ్యజగతికి దూరంగా ఆత్మ 
ఆనంద డోలికల్లో నర్తన !

నిలువెల్లా దహించే ఈ తపనఏల?
ఈ తృష్ణ ఎందుకో నువ్వైనా చెప్పవూ ?
నీవూ నల్లనమ్మవేగా యమునమ్మా !
అడిగింది కృష్ణారాధిక రాధిక !

నల్లని యమునమ్మ నవ్వి,
నీటిలో నీ నీడ చూసుకో అంది...
నీటిలోని కన్నయ్య నీడ నవ్వింది,
నీవే నేనంటూ నమ్మబలికింది.
నీ ఊపిరి, దేహం, ప్రాణం,
అంతా కృష్ణమయం అని,
తనువులు వేరైనా , ఏనాడో 
రాధ ఆత్మ కృష్ణునిలో లయమయ్యిందని.

అద్వైత భావనకు అర్ధం తెలిసి,
అన్వేషణ మానుకుంది రాధమ్మ.
అంతటా తానే ఉన్న స్వామిని,
అణువణువులోనూ ఆస్వాదిస్తోంది.
కృష్ణమయం జగత్ సర్వం !!

No comments:

Post a Comment